ఇండియాలో కరోనా వ్యాక్సిన్ జోరుగా వేస్తున్నారు. జనవరి 16న ఈ కార్యక్రమం ప్రారంభమవ్వగా 20 రోజుల్లోనే 50 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ప్రపంచంలో తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా ఇండియా టాప్లో నిలిచింది. నిన్న దేశంలో 11,814 కేంద్రాల్లో 5,09,893 మందికి టీకా ఇచ్చారు. తొలి డోసు తీసుకున్న వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో డోస్ ఇవ్వనున్నారు. జనవరి 16న తొలి డోస్ తీసుకున్నవారికి... ముందుగా రెండో డోస్ ఇస్తారు. జులై నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలన్న టార్గెట్ పెట్టుకుంది కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 67 దేశాల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. మొత్తం 7 వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఉంది. ఇప్పటివరకూ 11.90 కోట్ల మంది వ్యాక్సిన్ పొందారు. రోజూ 45 లక్షల మంది దాకా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అమెరికాలో ఇప్పటివరకూ 3.67 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
నిన్న ప్రపంచవ్యాప్తంగా 4.69లక్షల కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 10.58 కోట్లు దాటాయి. నిన్న 13,826 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాలు 23.07 లక్షలు దాటాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.59 కోట్లు ఉన్నాయి. అమెరికాలో నిన్న 1,15,997 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 2.73 కోట్లు దాటాయి. నిన్న 3,198 మంది చనిపోవడంతో... మొత్తం మరణాలు 4.70 లక్షలు దాటాయి. (image credit - twitter - reuters)
ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ (51,319) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (3,198) టాప్లో ఉండగా... మెక్సికో (1682), బ్రెజిల్ (1244), బ్రిటన్ (1014), జర్మనీ (776) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (image credit - twitter - reuters)
తెలంగాణలో నేటి నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్కి టీకా ఇవ్వనున్నారు. ఇందులో పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బందికి టీకాలు ఇస్తారు. రాష్ట్రంలో తాజాగా 37,387 టెస్టులు చెయ్యగా 169 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,95,270కి చేరింది. కొత్తగా ఒకరు చనిపోయారు. మృతుల సంఖ్య 1,607కి పెరిగింది. తాజాగా 189 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2,91,699 ఉన్నాయి. ప్రస్తుతం 1,964 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 780 మంది హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. GHMCలో కొత్తగా 31 కరోనా కేసులొచ్చాయి.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 33,876 టెస్టులు చెయ్యగా... 97 మందికి కరోనా వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 8,88,275కి చేరింది. కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 7158కి చేరింది. కొత్తగా 179 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,80,046కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 1071 యాక్టివ్ కేసులున్నాయి.