ఖమ్మం జిల్లా న్యూస్18 తెలుగు-కరస్పాండెంట్- జి.శ్రీనివాసరెడ్డి
మేయర్.. అంటే ఇమేజ్ ఉండే సీటు.. నాలుగు లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో ప్రజలకు అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాల అమలు పరంగా తన మార్కు చూపే అవకాశం ఉన్నా.. ఆ పదవిని చేపట్టడానికి ఆమె ఆసక్తి చూపలేదు. ఎందుకు.. కారణం ఏమై ఉంటుంది..? ఇదే ఇప్పుడు ఖమ్మం ప్రజల మదిలో మెదులుతూ... చర్చకు దారితీసిన అంశం.. అసలు అవకాశం వచ్చింది ఎవరికి..? ఆఫర్ చేసింది ఎవరు..? ఆసక్తి చూపంది ఎవరు..? పాఠకుల కోసం 'న్యూస్18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధి అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం..
మేయర్ పీఠంపై ఖమ్మంలో చర్చ
మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు హట్ హట్ గా కొనసాగుతున్నాయి. సహజంగా ఏ డివిజన్లో అధికార పార్టీ క్యాండిడేట్ ఎవరు..? ఎవరు గెలుస్తారో.. ఇంకెవరు గెలుపు కోసం పోరాటం చేస్తున్నారన్నది చర్చ జరగాల్సిన పరిస్థితి.. కానీ ఇక్కడ మాత్రం ఇందుకు భిన్నంగా మరో రకమైన చర్చ నడుస్తోంది. కాని అవకాశం వచ్చినా..అతి ఈజిగా మేయర్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నా.. మేయర్ కుర్చీని ఆమె వద్దని ప్రకటించింది..దీంతో ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

స్వాగతం పలుకుతున్న మంత్రి సతీమణి వసంతలక్ష్మి
అవకాశం ఉన్నా..
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సతీమణి వసంతలక్ష్మి. మున్సిపల్ ఎన్నికలు షురూ చేయకమునుపే ఆమే కాబోయే మేయర్ అని అందరూ భావించారు.. ముఖ్యంగా ఖమ్మం నగరానికి చెందిన అధికార పార్టీ నేతలు.. తాజా మాజీ కార్పోరేటర్లు.. ప్రస్తుతం కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఫిక్స్ అయిపోయారు. జన సంఖ్య ఆధారంగా నగరాల మేయర్ రిజర్వేషన్లు గతంలోనే ఖరారు కావడం... ఇక్కడ జనరల్ మహిళకు మేయర్ పదవి రిజర్వు కావడంతోనే దాదాపు అందరూ మంత్రి అజయ్కుమార్ సతీమణి వసంతలక్ష్మి ఈసారి మేయర్ కావడం ఖాయమన్న భావనకు వచ్చారు..

మంత్రి అజయ్కుమార్
ముందే మేయర్ గా ఫిక్స్ అయిన వసంతలక్ష్మి
అందుకే ఇప్పటిదాకా ఈ పదవిపై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. ఎటొచ్చీ ''మేయర్ పదవిపై తన సతీమణి వసంతలక్ష్మికి ఆసక్తి లేదని.. ఈ విషయంలో మెయిన్ స్ట్ర్రీం మీడియాలోనూ.. సోషల్మీడియాలోనూ వస్తున్న వార్తలన్నీ స్పెక్యులేషన్లో భాగమే.. మేయర్ ఎవరన్నది మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు.. రిజల్ట్ వచ్చాక.. గెలిచిన వారి నుంచి ఎంపిక ఉంటుందని సాక్షాత్తూ మంత్రి అజయ్కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ తేల్చేశారు.

సన్మాన కార్యక్రమంలో మంత్రి అజయ్ కుమార్ ఆయన సతీమణి వసంతలక్ష్మి
ఇతరులకు అవకాశం కల్పించేందుకే పోటి నుండి తప్పుకున్న మంత్రి సతీమణి
అయితే 20వ డివిజన్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సతీమణి వసంతలక్ష్మి నామినేషన్ దాఖలు చేసినా.. సీట్ల సర్దుబాట్లలో భాగంగా పార్టీలో సిన్సియర్గా కష్టపడుతున్న వారి అకామిడేషన్ కోసం స్వయంగా తానే తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఒక దశలో ఏదో ఒక కారణంతో టికెట్ దక్కనివారికి కోఆప్షన్ అవకాశం ఇస్తామన్న హామీ ఇచ్చినా.. ప్రజాక్షేత్రంలో ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎంతగా శ్రమిస్తున్నదీ స్వయంగా చూసిన మంత్రి అజయ్కుమార్.. తన ఇంటి నుంచే త్యాగం చేసినట్టు చెబుతున్నారు. తెరాసలో మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యే నిర్ణయానికే వదిలేయడం.. జయాపజయాలకు వారినే బాధ్యులను చేస్తుండడం తెలిసిందే. తెరాస టికెట్ దక్కడమే అదృష్టం అన్నట్టుగా పరిస్థితి ఉన్నా.. ఫలితం ఏకపక్షమే అన్నట్టుగా పరిస్థితులు ఉన్నా.. నిర్ణయాధికారం ఉన్నా పదవిని వదులుకోవడంపై తెరాస ఖమ్మం శ్రేణుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ కోసమే ఆమె పదవి వద్దన్నారా లేక ఇతర కారణాలు ఎవైనా ఉన్నాయా అనేది భవిష్యత్ రాజకీయాలు నిర్ణయించనున్నాయి.