iplఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) (ECB) మంచి అవకాశాన్ని కోల్పోయిందని మాజీ క్రికెటర్ మార్క్ బుచర్ (Mark Butcher) వ్యాఖ్యానించాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 (IPL 2021) అర్దాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా, ఈ లీగ్లోని మిగిలిన 31 మ్యాచ్లు సెప్టెంబర్లో నిర్వహించడానికి బీసీసీఐ (BCCI) సన్నాహాలు చేస్తున్నది. యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించడానికి వీలుగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో మార్పులు చేయాలని ఈసీబీని బీసీసీఐ అనధికారికంగా కోరినట్లు వార్తలు వచ్చాయి. రెండో టెస్టుకు, మూడో టెస్టుకు మధ్య ఉన్న 9 రోజుల గ్యాప్ను తగ్గించడం ద్వారా సెప్టెంబర్ 14 కంటే ముందే టెస్ట్ సిరీస్ ముగించేయవచ్చని ఇంగ్లాండ్ను కోరింది. అయితే ఈ ప్రతిపాదనను ఈసీబీ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్ 18 లేదా 19 నుంచి ఐపీఎల్ ప్రారంభించి మూడు వారాల్లోనే ముగించేయాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చింది. ఇక్కడే ఈసీబీ తప్పు పని చేసిందని బుచర్ అంటున్నాడు. బీసీసీఐ ప్రతిపాదనకు ఒప్పుకొని ఉంటే ఈసీబీకి మరి కొన్ని ప్రతిపాదనలు చేసే అవకాశం వచ్చేదని ఆయన అన్నాడు.
ఈసీబీ త్వరలో 'ది హండ్రెడ్' పేరుతో కొత్త లీగ్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. 100 బంతుల్లో ఆడే కొత్త ఫార్మాట్లో ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాల క్రికెటర్లు ఈ లీగ్లో ఆడుతున్నారు. అయితే ఎప్పటి లాగే బీసీసీఐ మాత్రం భారత ఆటగాళ్లను ఈ లీగ్కు పంపడం లేదు. ఎన్నో ఏళ్లుగా బీసీసీఐ ఈ పద్దతిని అనుసరిస్తున్నది. బీసీసీఐ కాంట్రాక్టు కలిగిన టీమ్ ఇండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, రంజీ ప్లేయర్లు ఇతర లీగ్స్లో పాల్గొనడంపై నిషేధం ఉన్నది. బీసీసీఐ నుంచి పూర్తిగా తెగతెంపులు చేసుకుంటేనే వాళ్లు ఇతర లీగ్స్లో ఆడేందుకు అర్హత సాధిస్తారు. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన స్టార్ బ్యాట్స్మెన్ ఎవరూ ఇతర లీగ్స్లో కనిపించరు. ఈసీబీ కనుక బీసీసీఐ ప్రతిపాదనకు ఓకే చేసి.. ది హండ్రెడ్లో భారత ఆటగాళ్లు కూడా ఉండేలా ఒప్పందం చేసుకొని ఉంటే బాగుండేదని బుచర్ అభిప్రాయపడ్డాడు. ఒక మంచి అవకాశాన్ని ఈసీబీ కోల్పోయిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈసీబీ చేసిన పొరపాటు కారణంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వంటి క్రికెటర్లను ది హండ్రెడ్ లీగ్లో చూసే అవకాశాన్ని కోల్పోయామని ఆయన అన్నారు.
కాగా, ది హండ్రెడ్ లీగ్ 2020లోనే ప్రారంభం కావల్సి ఉన్నది. అయితే కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ మ్యాచ్లు అన్నీ ఆగిపోవడంతో ఈసీబీ ఈ ఏడాదికి వాయిదా వేసింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ కొత్త ఫార్మాట్ లీగ్లో పలు దేశాల క్రికెటర్లు పాల్గొననున్నారు. అయితే కరోనా ఆంక్షల కారణంగా ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ ది హండ్రెడ్కు దూరంగా ఉంటున్నారు.