తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ
రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్లో చిచ్చుపెట్టింది. ఆయన నియామకాన్ని కొందరు సీనియర్ నేతలు తప్పుబట్టుతున్నారు. హైకమాండ్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓటుకు నోటు మాదిరిగానే.. పీసీసీ ఎంపిక జరిగిందని బాంబుపేల్చారు కోమటిరెడ్డి. ఈయన తీరుపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలలు కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన రాష్ట్ర నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మల్లురవి ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఫోన్ చేసి ఆరా తీశారు. మరికొందరు నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఇంగ్లీష్లోకి అనువదించి వారికి పంపించారు. కోమటిరెడ్డి తీరుపై మాణిక్కం ఠాగూర్ మండిపడినట్లు తెలిసింది. అదిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టంచేసినట్లు సమాచారం.
టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని నియమించడంపై ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన.. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇకపై తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు అంతా తన కార్యకర్తలే నిర్ణయిస్తారని అన్నారు. టీపీసీసీ కాస్త టీడీపీ పీసీసీగా మారిందని ఘాటైన విమర్శలు చేశారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. టీపీసీసీ పదవిని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారని.. ఓటుకు నోటు మాదిరిగానే, నోటుకు పీసీసీని అమ్మేశారని ఆరోపించారు. ఐతే కోమటిరెడ్డి వ్యాఖ్యలను మల్లురవితో పాటు పలువురు నేతలు ఖండించారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదని.. నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయాన్ని ప్రకటించారని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ను నిందించి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలి గానీ.. మీడియా ముందు ఏదిపడితే అది మాట్లాడడం మంచిది కాదన్నారు మల్లురవి.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. టి.జగ్గారెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, జె.గీతారెడ్డి, ఎం.అంజన్కుమార్ యాదవ్, బి.మహేశ్కుమార్ గౌడ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఉపాధ్యక్షులుగా సురేశ్ షెట్కార్, వేం నరేందర్రెడ్డి, చంద్రశేఖర్ సంబని, దామోదర్రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి.కుమార్ రావు, జావేద్ ఆమీర్లు ఉంటారని ప్రకటించింది. ఐతే రేవంత్ రెడ్డి నియామకాన్ని కొందరు సీనియర్లు తప్పుబట్టుతున్నారు. బయటి నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే తమ పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. మరో సీనియర్ నేత వీహెచ్ కూడా హైకమాండ్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిణామాల మధ్యే జులై 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు రేవంత్ రెడ్డి.
ఇవి కూడా చదవండి:
టీపీసీసీ కాస్త టీడీపీ పీసీసీగా మారింది.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాను.. పాదయాత్రపై రేవంత్ రెడ్డి క్లారిటీ