వచ్చే ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు సీరియస్గా దృష్టి పెట్టాయి. ఢిల్లీ తరువాత పంజాబ్ రాష్ట్రంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఆప్.. వచ్చే ఏడాది జరగబోయే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం అక్కడి ప్రజలను ఆకట్టుకోవడం ఎలా అనే అంశంపై అప్పుడే దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తాజాగా పంజాబ్ ప్రజలను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన హామీ ఇచ్చారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా విద్యుత్ ఇస్తామని ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం తాము ఢిల్లీలోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ మహిళలు ఆనందంగా ఉన్నారని అన్నారు. అయితే పెరుగుతున్న ధరల కారణంగా పంజాబ్ మహిళలు సంతోషంగా లేరని అన్నారు. దీనిపై మరిన్ని వివరాలు రేపు చండీగఢ్లో చెబుతానని కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ తరపున ముఖ్యమంత్రి ఎవరనే దానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని కేజ్రీవాల్ అన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫొటో)
పంజాబ్ సీఎం అభ్యర్థి సిక్కు సామాజికవర్గం నుంచే ఉంటారని.. ఆయన కారణంగా పంజాబ్ మొత్తం గర్వపడుతుందని వ్యాఖ్యానించారు. దీంతో కేజ్రీవాల్ ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును తెరపైకి తీసుకొస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.