PM NARENDRA MODI ADDRESS THE NATION URGES THE YOUTH TO COME FORWARD AND MAINTAIN COVID PROTOCAL SAYS LOCKDOWN IS LAST WEAPON BA
PM Modi Speech Highlights: లాక్ డౌన్ పెట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి.. ప్రధాని మోదీ పిలుపు
నరేంద్రమోదీ (File image credit - twitter - ANI)
లాక్ డౌన్ అనేది ఆఖరి అస్త్రంగానే చూడాలని ప్రధాని మోదీ అన్నారు. కరోనా నుంచి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న యువత ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని కరోనా నిబంధనలు అందరూ పాటించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నుంచి దేశం బయటపడడానికి ఏమేం చేయాలో ప్రధానమంత్రి సూచించారు. ముఖ్యంగా లాక్ డౌన్ అనేది ఆఖరి అస్త్రంగానే చూడాలన్నారు. కరోనా నుంచి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న యువత ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని కరోనా నిబంధనలు అందరూ పాటించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ ఎన్నో సవాళ్లు విసురుతోందని ప్రధాని మోదీ అన్నారు అయితే, ఆ సవాళ్లను మనం ఎదుర్కోవడానికి కొన్ని సూచనలు చేశారు. అత్యంత కఠిన సమయాల్లో మనం ధైర్యం కోల్పోకూడదని శాస్త్రాల్లో ఉందని, అలా ధైర్యం కోల్పోకుండా సరైన దిశలో ముందుకు సాగితే మనం కరోనా మీద విజయం సాధిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.
దేశంలో ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న ఆక్సిజన్ కొరతమీద కూడా ప్రధాని మోదీ స్పందించారు. ‘దేశంలో ఆక్సిజన్ కొరత ఉంది. అయితే, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా పెంచడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రాల్లో కొత్త ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటు అయ్యాయి. అలాగే, మెడిసిన్ ఉత్పత్తి కూడా పెరిగింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొన్ని రెట్ల ఉత్పత్తి పెరిగింది. దేశంలోని ఫార్మా దిగ్గజాలతో సుదీర్ఘంగా మాట్లాడా. ఉత్పత్తి పెంచడానికి అన్ని ఫార్మా కంపెనీలకు మద్దతు లభిస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచడానికి కృషి జరుగుతోంది.’ అని ప్రధాని మోదీ అన్నారు.
దేశంలో ప్రజలను తీవ్రంగా భయపెడుతున్న కరోనా సెకండ్ వేవ్ లో కూడా ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు అందరూ ఈ సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారని అభినందించారు. ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ వేస్తున్నాయని మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్న ఫార్మా కంపెనీలను ప్రధాని అభినందించారు. కరోనా మొదటి విడుత సమయంలో రాత్రి, పగలు కష్టపడి వ్యాక్సిన్ తయారు చేశారు చేశారన్నారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన వ్యాక్సిన్ ఇప్పుడు మన దేశంలోనే లభిస్తుందని చెప్పారు. దేశంలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు.
ఇక వలస కార్మికుల గురించి కూడా ప్రధాని మోదీ కొన్ని కీలక సూచనలు చేశారు. పలు రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ చేయడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ లాక్ డౌన్ పెడతారనే భయంతో తమ తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో వారికి ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. లాక్ డౌన్ అనేది చివరి అస్త్రంగానే ఉంటుందన్నారు. ఆ పరిస్థితి రానివ్వవద్దని సూచించారు. వలస కార్మికులు ఎక్కడి వారు అక్కడే ఉండేలా చూడాలని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. కొన్ని రోజుల్లోనే వారికి కూడా కరోనా వ్యాక్సిన్ లభిస్తోందని, ఉపాధి కూడా లభిస్తోందని భరోసా ఇచ్చారు.