ఆయన మాటల మాంత్రికుడు.., ఎవ్వరికీ ఓ పట్టాన కొరుకుడు పడడు. ఏదైనా పట్టుబట్టాడంటే సాధించే వరకు విశ్రమించడు. బక్కపలుచని దేహం.., గుండెల నిండా ధైర్యం ఆయన సొంతం. ఆయన ఎవరో ఈపాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది.ఆయనే తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖరరావు (కే.సీ.ఆర్). ఆంధ్రపాలకులను తరిమికొట్టమని పిలుపునిచ్చినా.., రామోజీ ఫిల్మ్ సిటీని వేలనాగళ్ళతో దున్నిపిస్త అని గద్దించినా.., మన తెలంగాణ మీద ఆంధ్రోళ్ళ పెత్తనం ఏందిరాభయ్ అంటూ ప్రశ్నించినా.. కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ లో అభిమానులు జాస్తి. ఉద్యమం సమయంలో ఏం మాట్లాడినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత తెలంగాణలో ఆంధ్రుల పట్ల ఆయన చూపిన ధృక్పథం కె.సి.ఆర్ ను అందరివాడిని చేసిందనే చెప్పాలి. తెలంగాణ ఇస్తే ఆధ్రావాళ్ళను హైదరాబాద్ నుండి తరిమేస్తారని.., మన ఇళ్ళూ వ్యాపారాలు లాగేసుకుంటారు అని కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులు ప్రజలను భయపెట్టినట్టు అక్కడ ఏమీ జరగక పోగా ఇప్పుడు ఉన్నపరిస్థితులలో ఎక్కువ మంది తమ పెట్టుబడులకు హైదరాబాద్ నగరమే మేలు అనుకునే పరిస్థితి.
కే.సి.ఆర్ గురించి ఈ ఉపోధ్ఘాతం అంతా ఇప్పుడు ఎందుకు చెప్పవలసివచ్చిందంటే. తాజాగా నాగార్జున సాగర్ సభ లో పాల్గొన్న తరువాత కే.సి.ఆర్ కరోన బారిన పడి తన ఫామ్ హౌస్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఐతే కే.సి.ఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆంద్రప్రదేశ్ లో ప్రజలు భారీగా చర్చించుకుంటున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎందుకంటే ఆయనే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఆయన కేమైనా ఐతే తెలంగాణ అభివృద్ధి.., ఇటు మన ఆంధ్ర ప్రజల పెట్టుబడులు ఒక్కసారిగా ప్రశ్నార్ధకంలో పడతాయని ప్రజలు బలంగా నమ్మడమే దీనికి కారణం. గతంలో ఎలా ఉన్నా ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్సంభంధాలను కలిగి ఉండటం.., మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో మొండివైఖరికి పోకుండా వీలైనంతగా సహకరిస్తుండటం కూడా ఆంధ్రప్రజలలో కేసీఆర్ పట్ల కొంత సానుకూలత ఏర్పడేలా చేసిందనే చెప్పాలి.
కేసీఆర్ ఆరోగ్యంపై ఏపీ నేతలు కూడా స్పందించారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఇక్కడి అభిమానులు కూడా కేసీఆర్ ఆరోగ్యం కోసం దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ కరోన వైరస్ బారి నుండి త్వరగా కోలుకుని పాలన భాధ్యతలు చేపట్టాలని ఆంధ్రులు కోరుకుంటున్నారు.