రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో ఢిల్లీ పర్యటనల్లో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకునేవారని ఆరోపించిన సజ్జల... వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అప్పట్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు జరిగాయని విమర్శించారు. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఇందుకు భిన్నమని ఆయన అన్నారు. ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిశారని.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రస్తావించారని సజ్జల వివరించారు. రాజకీయాలతో ఈ సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హోంమంత్రి అపాయింట్మెంట్ వాయిదా పడితే అది తప్పన్నట్టుగా కొందరు ప్రచారం చేశారని సజ్జల ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వంలో పోలవరం పనులు ముందుకు సాగలేదని... కరోనా సమయంలో కూడా పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం ఖాయమని సజ్జల మరోసారి స్పష్టం చేశారు. సీఎం జగన్ ముందుచూపుతో ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఇందుకు కేంద్ర సాయం కూడా ఉంటుందని సజ్జల అభిప్రాయపడ్డారు. రఘురామకృష్ణరాజు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, అందుకే తమ పార్టీ ఎంపీలు చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు.