
- News18
- Last Updated: January 20, 2021, 17:13 IST
నీటి కొరత వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లోనే పురాతన మానవాళి మనుగడ, నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. సహజసిద్ధంగా లభించే నీటిని పొదుపుగా వాడుకోకపోతే ఇతర సంక్షోభాలు ఎదురవుతాయి. నీటి వనరులు తగ్గిపోతే జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడి ప్రకృతి వైపరిత్యాలకు కారణమవుతుంది. గతంలో వర్షపాతం తగ్గినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో ప్రజలు గమనించారు. అందువల్ల ఇలాంటి సమస్యల బారిన పడకుండా, నీటి వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.
నిర్మాణాత్మక లోపాల వల్ల కొన్ని ప్రాంతాల్లో నీటి సంక్షోభం వస్తోంది. ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో కూడా నీటిని పొందడం కష్టంగా మారుతుంది. నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచకపోవడం, వాటి నిర్వహణకు చొరవ తీసుకోకపోవడం, పెట్టుబడులు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
వాతావరణ మార్పులు
వాతావరణ మార్పుల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, నీటి సంక్షోభం తలెత్తవచ్చు. పర్యావరణ అసమతుల్యతను (ecological imbalance) వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. తరచుగా వరదలు రావడం, వరదలు వచ్చినప్పుడు నీరు భూమిలోకి ఇంకిపోయే అవకాశాలు లేకుండా పోవడంవల్ల నీటి వనరుల సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది వాటర్ సైకిల్(water cycle)కు భంగం కలిగిస్తుంది. దీంతో వర్షపాతం తక్కువగా నమోదైనప్పుడు భూగర్భ జలాలు అడుగంటి కరవు పరిస్థితులకు కారణమవుతుంది.
పేదరికానికి దారితీస్తుంది
వాతావరణ మార్పులు, వాటర్ ఇన్సెక్యూరిటీ వల్ల భారతదేశ జనాభాలో ఎక్కువమంది ప్రజలు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. పేదవాళ్లు రోజులో ఎక్కువ సమయం నీటిని సేకరించడానికి కేటాయించడం వల్ల ఇతర పనులకు సమయం తగ్గిపోతుంది. దీంతో ఉత్పాదకత తగ్గిపోయి ఆదాయం తగ్గిపోతుంది. స్వచ్చమైన నీరు లభ్యంకాకపోవడం, కలుషితమైన నీరు తాగడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇది పోషకాహార లోపానికి కూడా దారితీస్తుంది. దీంతో ప్రజలు పనులు సమర్థంగా చేసుకోలేరు. దీంతో వారు ఎప్పటికీ పేదరికం (poverty cycle) నుంచి బయటకు రాలేరు.
ఇప్పటికైనా మేల్కోవాలి
భారతదేశంలోని ప్రజలు, నాయకులు ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలి. నీటి వనరుల సంరక్షణ, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. ఇలాంటి సమస్యలకు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. మొదటి దశలో ఇక్కడి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి. CNN- News18, హార్పిక్ ఇండియా సంస్థలు నీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా మిషన్ పానీ (Mission Paani) పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దేశ ప్రజలందరూ ఈ రెండింటికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటివల్ల ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని నీటి వృథాను అరికట్టడానికి, పరిసరాల పరిశుభ్రతను పాటించడానికి జల ప్రతిజ్ఞను (Jal Pratigya) తీసుకోవాలని ఈ సంస్థలు కోరుతున్నాయి.