AP Local Body Elections: ఏపీ పరిషత్ ఎన్నికలపై వీడిన ఉత్కంఠ...రేపే పోలింగ్

ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు (AP High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ, ఎస్ఈసీ పిటిషన్లపై కీలక తీర్పు ఇచ్చింది.

AP Local Body Elections:  ఏపీ పరిషత్ ఎన్నికలపై వీడిన ఉత్కంఠ...రేపే పోలింగ్

    ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. రేపు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిషత్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను కొట్టేసిన ధర్మాసనం ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొంది. ఐతే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఫలితాలు ప్రకటించరాదని పేర్కొంది. విచారణ సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఎస్ఈసీని కోరింది. ఐతే సరైన పత్రాలు సమర్పించకపోవడంతో విచారణను కాసేపు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఎందుకు పాటించలేదని ధర్మాసనం ఎస్ఈసీని ప్రశ్నించింది. ఎస్ఈసీ తరపున సీవీ మోహన్ రెడ్డి, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్ కు ఉంటాయని..4 వారాల కోడ్ ఉండాలన్న నిబంధన ఎక్కడ లేదని కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ తరపున పిటిషన్ దాఖలు చేసిన వర్ల రామయ్య... ఎన్నికల్లో పోటీ చేయడం లేదుగనుక.. పరిగణలోకి తీసుకోవద్దని కూడా కోరినట్లు సమాచారం. ఆయన టీడీపీ తరపున ఆయన పిటిషన్‌ వేయలేదని..., వ్యక్తిగతంగా రిట్‌ పిటిషన్‌ వేయకూడదని.. పిల్‌ మాత్రమే వేయాలని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

    కాగా ఎన్నికలను నిలిపేయాలంటూ బీజేపీ, టీడీపీ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన సింగిల్ జడ్జితో కూడిన బెంచ్.. బీజేపీ పిటిషన్ ను కొట్టేసింది. ఐతే టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం 4 వారల ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఎస్ఈసీ విఫలమైందని వ్యాఖ్యానించింది. ఎన్నికలు నిలిపేస్తున్నట్లు ఆదేశాలివ్వడంతో పాటు తుదపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ నేరథ్యంలో ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

    కోర్టు తీర్పుతో  రేపు రాష్ట్ర వ్యాప్తంగా 516 జెడ్పీటీసీ, 7,258 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు  జరగనున్నాయి.  జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బంది కేటాయింపుతో పాటు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల తరలింపు వంటి ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.

    ఇక ఈ నెల 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ.. అదే రోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ఏడాది ఎక్కడైతే ప్రక్రియ నిలిచిందో.. అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఎస్ఈసీ ప్రకటనను వ్యతిరేకించిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. తాజాగా ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    Published by:Purna Chandra
    First published:April 07, 2021, 15:14 IST