
- News18 Telugu
- Last Updated: November 19, 2020, 15:30 IST
నీటి వినియోగం విషయంలో ‘చల్తా హై’, చూద్దాంలే అనే ధోరణి సరికాదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మారుతున్న క్లైమేట్ చేంజ్లో ఇది సాయ పడదని చెప్పారు. News18-Harpic Mission Paani క్యాంపెయిన్లో భాగంగా నిర్వహించిన ‘జల ప్రతిజ్ఞ’ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో 18 శాతం కలిగిన భారతదేశంలో కేవలం 4 శాతమే పునరుత్పాదక నీటి వనరులు ఉండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. నీటి సంక్షోభం, క్లైమేట్ చేంజ్ సమయంలో చూద్దాం, చేద్దాం, చల్తా హై అనే ధోరణి సరికాదన్నారు. జల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని News18 నిర్వహించింది. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో నీటి వినియోగం, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు News18 ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. యాదృచ్ఛికంగా ఈ రోజే World Toilet Day కూడా రావడం విశేషం. ‘స్వచ్ఛత ఔర్ పానీ, ఆఖిర్ బచ్నా హై జిందగానీ’ అనే పేరుతో ప్రచారం చేపట్టింది.
నీటి సంరక్షణ ఓ ఉద్యమంలా సాగాలని, యువత సారధ్యంలో ఇది ముందుకు సాగాలని వెంకయ్యనాయుడు ఆంకాంక్షించారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొనేలా ఓ జన ఆందోళనకు పిలుపునివ్వాల్సిన అవసరం ఉందని కూడా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కొత్తగా కట్టే ప్రతి భవనానికి కూడా వర్షపు నీటిని పరిరక్షించే వ్యవస్థ తప్పకుండా ఉండాలని అన్నారు.
స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది ఏ విధంగా ఓ మహోద్యమంగా మారిందో, మిషన్ పానీ కూడా అలాగే, ఓ మహోద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. నీటి ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అలాగే, అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. భూమి మీద అందుబాటులో ఉన్న నీటిలో కేవలం 3 శాతం మాత్రమే ఫ్రెష్ వాటర్ అని, అందులో కూడా 0.5 శాతం మాత్రమే తాగేందుకు అందుబాటులో ఉందన్నారు.
News18-Harpic India సంయుక్తంగా Mission Paani అనే కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించాయి. నీటి వినియోగం, నీటి లభ్యత, వినియోగం గురించి ప్రజల్లో అవగాహన, నీటిని పొదుపు చేసేందుకు సాయం చేయడానికి ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.