
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 20:23 IST
విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఓ సూపర్ హిట్ జంట. ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాదు ఈ ఇద్దరికి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా కొనసాగుతోంది. ఈ జోడీ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం మేరకు ఈ హిట్ పెయిర్ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. అయితే విజయ్, రష్మిక జోడీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోయేది సినిమాలో కాదు, ఓ కమర్షియల్ యాడ్లోనట. సంతూర్ యాడ్ కోసం విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరూ కలిసి నటించనున్నారు. దీనికి సంబంధించిన షూట్ కూడా పూర్తైంది. దీంతో త్వరలోనే ఈ యాడ్ టీవీల్లో ప్రసారం కానుంది. ఇక ఇదే యాడ్లో గతంలో సూపర్ స్టార్ మహేష్ చేశాడు. ఆయన కూడా తన క్యూట్ లుక్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఛార్మీ, కరణ్ జోహార్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ, కన్నడ మలయాళీ భాషాల్లో విడుదలకానుంది.
ఇక రష్మిక మందన విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం ఓ హిందీ చిత్రంతో పాటు తెలుగులో పుష్పలో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలకానుంది.