
- News18 Telugu
- Last Updated: April 12, 2021, 17:10 IST
మరణించిన తర్వాత తన కుమారులు శ్రమ పడకుండా..తాను బతికుండగానే సమాధిని నిర్మించుకున్నాడు ఓ వృద్ధుడు. ఎంత సంపాదించినా చివరకు చేరేది ఆరడుగుల గోతిలోనేనని, అందుకే సమాధి నిర్మించుకున్నట్లు తెలిపాడు. 20 ఏళ్ల క్రితమే రాతి నిర్మాణంతో నిర్మించిన ఈ సమాధి వద్దకు ఆయన తరుచూ వచ్చి సేద తీరుతుంటారు. ఈ వింత ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం లక్ష్మీపూర్కు చెందిన నక్క ఇంద్రయ్య తాను బతికుండగానే సమాధిని నిర్మించుకున్నారు . 75 ఏళ్ల ఇంద్రయ్య 20 ఏళ్ల కిందటే ఈ సమాధి నిర్మించుకోగా ఆయన భార్య గతంలో మృతి చెందగా ఈ సమాధి పక్కనే మరో సమాధి నిర్మించారు . రెండు సమాధులనూ రాతి నిర్మాణంతో పూర్తి చేశారు . నక్క ఇంద్రయ్య గతంలో చాలా అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లి చాలా డబ్బులు సంపాదించి తిరిగి ఇండియా కు వచ్చి సంపాదించిన డబ్బులో కొంత ఆశ్రమాలకు ఇచ్చాడు.
అలాగే తన సొంతూరికి కమాన్, తెలంగాణా తల్లి విగ్రహం, అంబేద్కర్ బొమ్మలను ఊర్లో నిర్మించాడు. ఊర్లో గురుకుల స్కూల్స్ కి కోటి యాభై లక్షలు ఇచ్చి గురుకుల పాఠశాలలు నిర్మించాడు. ఇలా ఎంత సంపాదించినా చివరికి చేరేది ఇక్కడికే గనుక సమాధి నిర్మించుకున్నట్లు ఇంద్రయ్య తెలిపారు . తన కుమారులు శ్రమ పడకుండా కేవలం తన మృతదేహాన్ని అక్కడ ఏర్పాటు చేసిన బండను తీసి పెడితే సరిపోతుందన్నారు .