
- News18 Telugu
- Last Updated: August 30, 2019, 13:21 IST
ఏపీ ప్రజలకు సురక్షిత తాగు నీటి సరఫరా తమ ప్రధాన లక్ష్యం అని సీఎం జగన్ తెలిపారు. ఈ రోజు తాగు నీటి సరఫరాపై ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. వాటర్ గ్రిట్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు. మొదటి దశలో శ్రీకాకుళం, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో, రెండో దశలో విజయనగరం, విశాఖ, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో, మూడో విడతలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో చేపట్టాలని చెప్పారు. ఉద్దానం తాగు నీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికి వర్తింపజేయాలని తెలిపారు. నీటిని తీసుకున్న చోటే శుద్ధి చేసి అక్కడి నుంచి పంపిణీ చేయాలని ప్రాథమికంగా సీఎం జగన్ నిర్ణయించారు. దీనిపై నిశిత అధ్యయనం చేసి, ప్రణాళిక ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న తాగునీటి చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పరిగణలోకి తీసుకోవాలని, అందులో తాగు నీరు నింపిన తర్వాత నీరు కలుషితం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని వెల్లడించారు. కిడ్నీసంబంధ వ్యాధులు వచ్చే ప్రాంతాల్లో ట్రీట్మెంట్ప్లాంట్ నుంచి నేరుగా ఇళ్లకే తాగు నీటిని పంపిణీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ అధికారులు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.